హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా రెండురోజూ కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయటపడటం ఆందోళన కల్గిస్తోంది. బుధవారం మూడు నమోదవగా, గురువారం మరో నాలుగు నిర్ధారణయ్యాయి. వీరిలో ఇద్దరు కెన్యా దేశస్థులుగా, ఒకరు సోమాలియాకు చెందిన వ్యక్తిగా, మరొకరు యూకే నుంచి దుబాయ్ మీదుగా రాష్ట్రానికి చేరిన హైదరాబాద్ వాసిగా గుర్తించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ‘‘హైదరాబాద్ యూసుఫ్గూడకు చెందిన వ్యక్తి(31) యూకే నుంచి బయల్దేరి ఈ నెల 15న ఇక్కడికి చేరుకున్నారు. కెన్యాకు చెందిన ఇద్దరు మహిళలు (24 ఏళ్ల వయసు), సోమాలియాకు చెందిన వ్యక్తి(44) ఈ నెల 13, 14 తేదీల్లో షార్జా, దుబాయ్ మీదుగా హైదరాబాద్కు వచ్చారు. వీరు ముగ్గురూ రాజధాని నగరంలోని ఆసుపత్రుల్లో వైద్య చికిత్సల కోసం వచ్చినట్టు గుర్తించామని’ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఒక్కరు మినహా మిగిలిన వారు ముప్పు(రిస్క్)లేని దేశాల నుంచి వచ్చిన వారేనన్నారు. కొత్తవాటితో కలిపి మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7కు పెరిగిందని స్పష్టంచేశారు.
సన్నిహితంగా మెలిగిన వారికోసం వేట
కొత్తగా ఒమిక్రాన్ సోకిన వారిని టిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులను గుర్తించడంపై వైద్యఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. ఈ నలుగురు ఎక్కడెక్కడ పర్యటించారు? ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారు? తదితర సమాచారాన్ని సేకరిస్తోంది. శుక్రవారం వారందరికీ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తామని, ఎవరికైనా పాజిటివ్గా నిర్ధారణయితే నమూనాలు సేకరించి జన్యుక్రమ విశ్లేషణకు పంపుతామని వైద్యవర్గాలు తెలిపాయి.
కంటెయిన్మెంట్ జోన్గా టోలీచౌకి
తాజాగా ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఉలిక్కిపడిన ఆరోగ్యశాఖ విదేశీయులు ఎక్కువగా నివాసముంటున్న టోలీచౌకిలోని ఒక కాలనీపై దృష్టిసారించింది. ఆ ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ జోన్గా ప్రకటించింది. బుధవారం 120 మంది, గురువారం 430 మంది నుంచి నమూనాలను సేకరించింది. వీరిలో ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే, వారి నమూనాలను జన్యుక్రమ విశ్లేషణకు పంపిస్తామని వైద్య వర్గాలు తెలిపాయి.
కొత్తగా 190 కొవిడ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 190 కొవిడ్ కేసులు నిర్ధారణవడంతో బాధితుల సంఖ్య 6,79,064కు పెరిగింది. మరో ఇద్దరు మృతి చెందటంతో మొత్తం మరణాల సంఖ్య 4,012కి చేరింది. తాజా ఫలితాల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 80 మందికి కొవిడ్ సోకింది.