
హైదరబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శబరిమలకు 200 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. కేరళ అధికారులతో సంప్రదింపులు జరిపి.. పంబా వద్ద స్పాట్ బుకింగ్ ద్వారా బస్సులోని భక్తులందరూ ఒకే సమయంలో దర్శనం చేసుకునే సదుపాయాన్ని కల్పించామని వెల్లడించారు. బస్సును ముందుగానే అద్దె ప్రాతిపదికన బుక్ చేసుకున్న పక్షంలో గురుస్వామితో పాటు ఆరుగురు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని సజ్జనార్ పేర్కొన్నారు. బుకింగ్ రద్దు ఛార్జీలను కూడా సవరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
48 గంటల కన్నా ముందుగా రద్దు చేసుకుంటే మునుపటి మాదిరిగానే రూ.1000 వసూలు చేస్తారు. 24 గంటల నుంచి 48 గంటల లోపు రద్దు చేసుకుంటే గతంలో అద్దె మొత్తంలో పది శాతాన్ని మినహాయించేవారు. ఇక నుంచి రూ.5,000 మాత్రమే మినహాయిస్తారు. 24 గంటల ముందు నుంచి బయలుదేరే సమయం వరకు రద్దు చేసుకుంటే గతంలో 30 శాతంగా ఉన్న రద్దు ఛార్జీని రూ.10 వేలకు పరిమితం చేశారు. మరింత సమాచారం కోసం 040 30102829లో లేదా సమీప డిపో మేనేజర్ను సంప్రదించాలని సజ్జనార్ పేర్కొన్నారు.